Tirumala: కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌలభ్యం కోసం టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేయడం జరిగిందన్నారు. తద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.

గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుందనీ, తద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుందని తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని చెప్పారు. కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది. తద్వారా ప్రతి రోజు మూడు గంటల సమయం ఆదా అవుతుంది. క్యూలైన్లలో గంటల తరబడి కిలో మీటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామివారి దర్శనం అవుతుందని ఆయన వివరించారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు సహకరించాలని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.