TTD: అతడో యాచకుడు. రోజంతా యాచించడమే పని. అలా వచ్చిన డబ్బుతో బతుకు సాగిస్తున్నాడు. చూసినోళ్లంతా అతడు చాలా పేదవాడని అనుకున్నారు. కానీ, కట్ చేస్తే.. ఆ యాచకుడు లక్షాధికారి అని తేలింది. అతడి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంతా లెక్క వేస్తే అక్షరాల 6లక్షలు ఉంది.తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో ఏకంగా రూ.6 లక్షలు బయటపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శేషాచల నగర్ లోని అతడి నివాసంలో నోట్ల కట్టలు వెలుగుచూశాయి.
ఎవరీ శ్రీనివాసన్?
ఆ యాచకుడి పేరు శ్రీనివాసన్. తిరుమల కొండపైకి వచ్చే వీఐపీల దగ్గర భిక్షాటన చేసేవాడు. తిరుమల నిర్వాసితుడి కేటగిరీలో అతడికి తిరుపతిలో శేషాచల నగర్ లో ఇంటిని కేటాయించారు.అయితే, శ్రీనివాసన్ అనారోగ్య కారణాలతో గతేడాది మరణించాడు. అతడికి నా అన్నవాళ్లెవరూ లేకపోవడంతో శేషాచల నగర్ లోని అతడి నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు టీటీడీ అధికారులు అతడి ఇంటికి వెళ్లారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన టీటీడీ అధికారులు ఏమున్నాయా ఆని చూస్తుండగా ఇంట్లో రెండు ట్రక్కు పెట్టెలు కనిపించాయి. అవి తెరిచి చూడగా, అందులో కరెన్సీ కట్టలు కనిపించాయి.దీంతో అధికారులు అవాక్కయ్యారు.వాటి విలువ రూ.6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. విజిలెన్స్ సమక్షంలో టీటీడీ సిబ్బంది వాటిని లెక్క పెట్టారు.గంటన్నరకు పైగా లెక్కించారు. డబ్బు లెక్కింపు కోసం కరెన్సీ కౌంటింగ్ మెషీన్ కూడా తెప్పించారు. దాదాపు 5మంది సిబ్బంది నగదు లెక్కించారు. శ్రీనివాసన్ ఇంట్లో దొరికన ట్రంకు పెట్టెలో కొన్ని నోట్లు రద్దు చేసినవి(రూ.500, వెయ్యి రూపాయలు) కూడా ఉన్నాయి. అలాగే కొత్త రూ.2వేల నోట్లు కూడా ఉన్నాయి.శ్రీనివాసన్ కొండపై చాలా రకాలుగా డబ్బు సంపాదించే వాడు. యాచకుడిగా చాలా ఏళ్లు కొనసాగాడు. తిరుమలకు వచ్చే యాత్రికుల నుంచి యాచించే వాడు.మొత్తం మీద బాగానే సంపాదించుకున్నప్పటికీ అనుభవించకుండానే శ్రీనివాసన్ ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు.