(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరాతి ఘోరంగా తయారైన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్ర ప్రాంతీయులు అధికంగా ఉన్న కూకట్పల్లి ఏరియాలో సైతం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు మనుమరాలు సుహాసిని గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర విభజన తరువాత పార్టీ అధినేత చంద్రబాబు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపడంతో ఇక్కడి నాయకులు వారి రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలను చూసుకున్నారు. కొందరు సీనియర్లు అధికార టిఆర్ఎస్ పార్టీలోకి జంప్ కాగా మరి కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఏడు సంవత్సరాలుగా తెలంగాణ టిటిపి అధ్యక్షుడుగా ఎల్ రమణ కొనసాగుతున్నారు.
రాష్ట్ర విభజనకు పూర్వం వరకు తెలంగాణలో టీడీపీ చాలా బలంగానే ఉండేది. పేరు మోసిన నాయకులతో పాటు పార్టీకి కమిట్మెంట్గా పని చేసే కార్యకర్తలు ఊండేవారు. అయితే పార్టీ అధినేతే తెలంగాణ పై సీత కన్ను వేయడంతో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న మెజార్టీ సీనియర్ నేతలు పార్టీని వీడటంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి వామపక్షాల కంటే దిగజారింది. గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపి బోణి కూడా కొట్టలేకపోయింది.
అయితే త్వరలో గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు సీనియర్ టీడీపీ నేతలు తమ ఉనికిని చాటాలని భావిస్తున్నారు. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు ఎల్ వెంకట రమణ నేతృత్వంలో పార్టీ పయనిస్తే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయని భావిస్తున్నారుట. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ పార్టీ అధ్యక్షుడిని మార్చాలంటూ చంద్రబాబుకు లేఖ రాశారట. ఏడేళ్లుగా ఒకే అధ్యక్షుడి నాయకత్వంలో ఉండటంతో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని అంటున్నారు.
గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతం చేయాలంటే మండల, నియోజకవర్గ, పార్లమెంటరీ ఇన్ చార్జిలను మొదలు కొని కోర్ కమిటీ వరకూ నాయకత్వాన్ని మార్చాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కువ రోజులుగా హైదరాబాద్లోనే ఉంటున్న చంద్రబాబు ఈ విషయంపై ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో అయినా టీడీపి ఉనికిని చాటుకుంటుందో లేదో చూడాలి మరి.