టివి నటి శ్రావణి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. సీరియల్స్ లో నటించే కొండపల్లి శ్రావణి హైదరాబాద్ లోని మధురానగర్ లో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. కాగా ఈరోజు తన ఇంటి బాత్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకున్నారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో వెళ్లి చూసిన కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు.
అయితే శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి వేధింపులే కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరలోని గొల్లప్రోలులో నివసించే దేవరాజ్ రెడ్డితో శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయమైంది. అప్పటినుండి ఇద్దరూ టచ్ లో ఉంటున్నారు. గత కొద్ది రోజుల నుండి దేవరాజ్ శ్రావణిని వేధిస్తున్నాడని, అప్పటినుండి ఆమె ఒత్తిడిలో ఉంటోందని, బాగా టెన్షన్ గా కనిపిస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.