ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సహా దాని అనుబంధ సంస్థలను భారత ప్రభుత్వం అయిదేళ్ల పాటు నిషేధించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం రాత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సదరు సంస్థలపై కేంద్రం నిషేదం విధించిన మరుసటి రోజే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పీఎఫ్ఐ అధికారిక ఖాతాలను ట్విట్టర్ గురువారం నుండి నిలిపివేసింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పీఎఫ్ఐ, ఎనిమిది అనుబంధ సంస్థలను అయిదేళ్ల పాటు కేంద్రం నిషేదించింది. అయితే సోషల్ మీడియా సైట్ లు ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వేదికగా ఈ సంస్థ తమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉన్న దృష్ట్యా …పీఎఫ్ఐ కి చెందిన అన్ని సోషల్ మీడియా ఖాతాలను మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ ఇవేళ పీఎఫ్ఐ ఖాతాను బ్లాక్ చేసింది. పీఎఫ్ఐ అధికారిక ట్విట్టర్ ఖాతాకు దాదాపు 81వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఉగ్ర ముఠాలతో సంబంధాలు కొనసాగిస్తున్న పీఎఫ్ఐ. దేశంలోని 15 రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తొంది. పీఎఫ్ఐ నిర్వహిస్తున్న విద్రోహ చర్యలను గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇటీవల పెద్ద ఎత్తున సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. వంద మందికిపైగా ఆ సంస్థ కీలక నేతలను, మద్దతుదారులను అరెస్టు చేసింది ఎన్ఐఏ. ఆ తర్వాత కేంద్రం నిషేదంపై నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం నేపథ్యంలో సదరు సంస్థ కూడా తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
పీఎఫ్ఐ సంస్థలపై కేంద్రం కీలక నిర్ణయం