ఏలూరు పట్టణ ప్రజలను అంతుచిక్కని వ్యాధి ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 600మందికిపైగా ఈ వ్యాధిని పడగా సుమారు 450 మందికి పైగా ఇప్పటికే చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎప్పటికప్పుడు ఏలూరు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష కూడా నిర్వహించారు.
కాగా ఈ వ్యాధి లక్షణాలతో ఇంతకు ముందే ఒకరు మృతి చెందగా తాజాగా మరో ఇద్దరు మృతి చెందడం ఆందోళన కల్గిస్తున్నది. వింత వ్యాధి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురైన 30 మందిని విజయవాడ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బరావమ్మ (56), అప్పారావు (50) మృతి చెందారు. అయితే సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. వ్యాధికి గల కారణాలపై జాతీయ వైద్య సంస్థల వైద్య నిపుణులు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పరిశోధన జరిపి ప్రాధమిక వివరాలు వెల్లడించారు.