కరోనా వైరస్ కారణంగా ఇద్దరు ప్రేమలో పడి జంట అవ్వడం విశేషం. అది కూడా వారం, పది రోజుల వ్యవధిలోనే అంతా జరిగింది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన అబ్బాయి, ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కరోనా చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యారు.
ఇద్దరివీ పక్క పక్క బెడ్స్ కావడంతో మాటలు కలిసాయి. తర్వాత అభిరుచులు కలిసాయి. ఒకటే సామాజిక వర్గం. ఇంకేముంది పెద్దల ఆమోదం పొందారు. అడ్మిట్ అయిన 10 రోజుల తర్వాత కరోనా నెగటివ్ రావడంతో ఇద్దరూ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 25న పొన్నూరులోని ఒక దేవాలయంలో ఇద్దరూ ఒకటయ్యారు. కరోనా రాసిన ప్రేమకథ అంటూ ఇప్పుడు వీరి ప్రేమకథ వైరల్ అవుతోంది.