బస్తర్: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ చత్తీస్గడ్లోని బస్తర్ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు నిచ్చారు. వారం రోజుల క్రితం ఏప్రిల్ తొమ్మిదిన మావోయిస్టులు పెట్టిన మందుపాతర పేలడంతో రాష్ట్రంలోని బిజెపి ఏకైక ఎమ్మెల్యే భీమా మాండవితో పాటు మరో ముగ్గురు భద్రతా సిబ్బంది, ఒక పోలీస్ డ్రైవర్ మృతి చెందారు.
ఈ నేపథ్యంలో దౌలికర్క అడవుల్లో మావోయిస్టులు తిరుగుతున్నారన్న సమాచారంతో గురువారం పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో అటు మావోయిస్టులు ఇటు పోలీసులకు మధ్య దంతెవాడ ప్రాంతంలో హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఒక మావోయిస్టు కమాండర్, మరో మావోయిస్టు ఈ కాల్పుల్లో మృతి చెందారు. మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.
మందుపాతర పెట్టి ఎమ్మెల్యే భీమా మాండవితో పాటు మరో ముగ్గురి మృతికి కారణమైన మావోయిస్టు కమాండర్ వర్గీస్ ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు తెలుపుతున్నారు.
ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు ఎవ్వరూ ఓటు వెయ్యొద్దని మావోయిస్టు నేతలు పిలుపునిచ్చారు. ప్రజలు పోలింగ్లో పాల్గొనకుండా భయపెట్టేందకు మావోయిస్టులు అడవుల్లో తిరుగుతున్నట్లు సమాచారం.
ఘటనా స్థలంలో ఒక 315 బోర్ రైఫిల్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, రెండు పేలుడు పదార్థాలు, నక్సల్స్ ప్రచార సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయాంళనలు వ్యక్తం చేస్తున్నారు.