(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
అంతర్వేదిలో శ్రీలక్ష్మీనర్శింహస్వామి ఆలయ రథం తగులబడిన సంఘటన మరువక ముందే విజయవాడ దుర్గగుడిలో మరో ఘటన వెలుగు చూడటం తీవ్ర కలకలాన్ని రేపుతున్నది.
విజయవాడ దుర్గగుడిలో రెండు వెండి సింహాలు అపహరణకు గురైనట్లు ఒక తెలుగు టీవి ఛానల్లో ప్రసారం అవ్వడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అమ్మవారి మహామండపం కింద ఉన్న అమ్మవారి రథంలో వెండి సింహాలు మాయం అయినట్లు సమాచారం. ప్రత్యేక భద్రతా చర్యలు, నిఘా వ్యవస్థ ఉన్న ఈ ఆలయంలో వెండి సింహాలు మాయం కావడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వెండి సింహాలు ఎప్పుడు మాయం అయ్యాయి అన్న విషయం తెలియదు కానీ మంగళవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది అంటున్నారు. దీనిపై వెండి సింహాలు మాయం అయ్యాయా లేదా అన్న విషయంపై ఆలయ అధికారులు ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అంతర్వేది ఘటనపై హింధూ సంఘాలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే విజయవాడలో ఈ వెండి సింహాల మాయం వెలుగు చూడటం సంచలనం కల్గిస్తోంది.