తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన సంచలన, ప్రత్యేక నిర్ణయాలకు ఆయన పెట్టింది పేరు.
తాజాగా, తెలంగాణ ముఖ్యమంత్రి నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి తీసుకువచ్చారు. అయితే, దీనిపై విపక్షాలు, వివిధ సంఘాలు విమర్శలు గుప్పించాయి. తాజాగా కొన్ని సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.
ఈ సంఘం ఏమందంటే….
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రజలకు పారదర్శకంగా పాలన, మెరుగైన మరియు సత్వర సేవలు అందించుటకు ఉపయోగపడుతుందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ట్రెసా చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మిగతా హామీలను కూడా త్వరలో పరిష్కరిస్తారని నమ్మకం ఉందని వారు విశ్వాసం వ్యక్తం చేసారు. CCLA మరియు రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీని త్వరలోనే నియమించాలని కోరారు. పదోన్నతులు కల్పించాలని, తహసీల్దార్ల నుండి డిప్యూటీ కలెక్టర్లకు, అలాగే డీసీలకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు గా అడ్ హాక్ ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ శాఖలో ఖాళీలన్ని భర్తీ చేయాలని, కార్యాలయాల నిర్వహణకు సరిపోయే బడ్జెట్ కేటాయించి, తగు మౌలిక వసతులు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
మంచి రోజులు వచ్చాయట
కొత్త చట్టంతో రెవెన్యూ శాఖకు మంచిరోజులు వచ్చాయని టీఎన్జీవో కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు కారం రవిందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకు రావడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్న ఆయన పాత రెవిన్యూ చట్టాలలో ఉన్న లొసుగులవలన ఇటు ఉద్యోగులు, అటు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కొత్త చట్టం వలన ప్రజలకు సత్వర సేవలు అందుతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ మరియు ముటేషన్ ఒకే కార్యాలయంలో జరగడం తో జాప్యం నివారించడమే కాకుండా అవినీతికి ఆస్కారం లేకుండా రైతులకు నేరుగా పాసుబుక్కులు అందుతాయని వివరించారు. వీఆర్వోల వ్యవస్థను రద్దుచేసిని వారిని ఇతర శాఖలలో అదేస్థాయిలో విలీనం చేసి వారికి ఉద్యోగ భద్రతో పాటు మంచి భవిష్యత్తును కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడంతో, ఎన్నో సంవత్సరాలుగా పదోన్నతులు లేక అవస్థలు పడుతున్న వారికి మంచి భవిష్యత్తును ప్రసాదించారని, అవినీతి ముద్ర నుంచి బయటపడ్డారని విశ్లేషించారు. రెగ్యులర్ స్కేలు కొరకు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వీఆర్ఏలకు ముఖ్యమంత్రి ప్రకటన అమితమైన ఆనందాన్ని ఇచ్చిందన్నారు. కొత్త రెవిన్యూ చట్టం వలన వీఆర్ఏలు రెగ్యులర్ ఉద్యోగులుగా మారబోతున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి తీసుకువస్తున్న కొత్త రెవిన్యూ చట్టం దేశానికే ఆదర్శం కాబోతుందని తెలిపారు.
విపక్షాలు అలా…ఉద్యోగ సంఘాలు ఇలా
కాగా, విపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ తీసుకొన్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని కొందరు నేతలు ప్రశంసించడంఆసక్తిని రేకెత్తిస్తోంది అవినీతికి పాల్పడిన ఉద్యోగులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడం హర్షణీయమని పలువురు పేర్కొంటున్నారు. వీఆర్ఏలు, వీఆర్ఓలు ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ ప్రకటనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?