Sajjala Ramakrishna Reddy: శాసనమండలి రద్దు నిర్ణయానికే ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విస్పష్ట ప్రకటన చేయడం వైసిపిలో విస్ఫోటనం రేపింది. రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు శాసనమండలి రద్దు విషయంలో జగన్ మాట తప్పారు..మడం తిప్పారు అంటూ లేఖ రాసిన నేపథ్యంలో సజ్జల స్పందించారు.”శాసనమండలి రద్దు నిర్ణయం విషయంలో మా వైఖరిలో మార్పులేదు”అని సజ్జల కుండబద్దలు కొట్టారు.”ప్రస్తుతం ఈ వ్యవహారం కేంద్రం పరిధిలో ఉంది.వారు శాసన మండలిని రద్దు చేస్తే ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తాం “అని కూడా రామకృష్ణారెడ్డి తెలిపారు.అయితే ఢిల్లీ వెళ్లినప్పుడల్లా శాసనమండలి రద్దు విషయమై కేంద్రానికి విన్నపాలు చేయబోమని ఆయన పేర్కొన్నారు.”ఒకవేళ శాసనమండలి రద్దయితే ఇప్పుడున్న మా పార్టీ సభ్యులంతా పదవులు కోల్పోతారు.దాని గురించి మేం భయపడం”అని సజ్జల వ్యాఖ్యానించారు.
Sajjala Ramakrishna Reddy: కలకలం రేపుతున్న సజ్జల కామెంట్స్!
శాసనమండలి రద్దుకు సంబంధించి సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.శాసనమండలి రద్దుకు అసెంబ్లీకి పంపిన ఏకగ్రీవ తీర్మానం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉండగా రద్దు చేస్తే చేసుకోండంటూ సజ్జల పేర్కొనడం తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చునని పలువురు నేతలు భయపడుతున్నారు.శాసనమండలి సభ్యత్వం కోసం వైసిపిలో చాలామంది ఆశావహులు ఉన్నారు.ఇప్పటికే చాలామంది ఎమ్మెల్సీలు అయ్యారు.ఈ పరిస్థితుల్లో కౌన్సిల్ ఉంటేనే వారందరికీ పునరావాసం దక్కుతుంది.కౌన్సిల్ రద్దయితే సీనియర్లకు కూడా సీన్ ఉండదు.సజ్జల రామకృష్ణారెడ్డి వంటి సీఎం సన్నిహితుడు కౌన్సిల్ రద్దుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పటం చిన్న విషయం కాదని పార్టీ అగ్రనేతలే చెవులు కొరుక్కుంటున్నారు.చివరకు తమ పరిస్థితి వైసిపిలో కరివేపాకు మాదిరి అవుతుందేమోనని వారు గొణుక్కుంటున్నారు.
శాసనమండలి రద్దు తీర్మానం వెనుక!
శాసనమండలిలో మెజారిటీ లేనప్పుడు, టిడిపి సభ్యులు ఇబ్బందులు పెడుతున్నప్పుడు మూడు రాజధానులు బిల్లుకు ఆమోదం దొరకనప్పుడు జగన్ ఆవేశపడి శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయించిన విషయం విదితమే.అయితే ఇప్పుడు శాసనమండలిలో వైసిపి పూర్తి మెజారిటీ వచ్చింది.కానీ శాసనమండలిలో తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది.దాన్ని ఉపసంహరించుకునే ఆలోచన జగన్ ప్రభుత్వానికి లేదని సజ్జల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.ఇదే వైసిపిలోని పలువురికి ఆందోళన కలిగిస్తోంది.