Uddhav Thackeray: గత కొద్ది రోజులుగా దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ సంక్షోభం (Political Crisis) నూతన ప్రభుత్వం ఏర్పాటుతో సమసిపోయింది. శివసేన (Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, బీజేపీ (BJP) నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామంపై తాజా మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు అమిత్ షా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండుంటే నేడు బీజేపీ నేత ముఖ్యమంత్రి పీఠంపై ఉండేవాడని వ్యాఖ్యానించారు ఉద్దవ్.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ రోజు ఒప్పందం ప్రకారం తొలి రెండున్నరేళ్లు శివసేన నేత సీఎం అయ్యేందుకు అమిత్ షా అంగీకరించి ఉండి ఉంటే రాష్ట్రంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉండేది కాదనీ, తొలి రెండున్నరేళ్లు శివసేన, తరువాత రెండున్నరేళ్లు బీజేపీ పాలించేవని ఉద్దవ్ అన్నారు. కానీ “నిన్న ఏమి జరిగింది. తనకు తాను శివసేన నేతనని చెప్పుకునే వ్యక్తి సీఎం అయ్యాడు. ఆ సీఎం (శిందే) శివసేన నేత కాదు” అని ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు.
గత ఎన్నికల ముందు వరకూ మిత్రపక్షంగా ఉన్న శివసేన, బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయాయి. శివసేనకు తొలి రెండున్నరేళ్లు సీఎం పదవి ఇవ్వడానికి బీజేపీ అంగీకరించని పరిస్థితిలో ఉద్దవ్ ఠాక్రే ..కొత్త పొత్తులకు బీజం వేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.
ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీలో 106 స్థానాలతో అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మరో సారి సీఎం బాధ్యతలు చేపడతారని అందరూ ఊహించారు. ఫడ్నవీస్ కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని భావించారు. అయితే చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ చోటుకుని దేవేంద్ర పడ్నవీస్.. శిందే సర్కార్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఇందుకోసం బీజేపీ కేంద్ర పెద్దలు ఫడ్నవీస్ ను ఒప్పించారు.