మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేకి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే కు అనుకూలంగా తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. అసలైన శివసేన ఎవరిదని గుర్చించే అధికారం కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ అధికారం ఎన్నికల కమిషన్ కు ఉందని తెలిపింది. మహారాష్ట్రలో శివసేన నుండి వేరు కుంపటి పెట్టుకుని ఏక్ నాథ్ శిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మెజార్టీ ప్రకారం శివసేన పార్టీ కూడా తమదేనని శిండే వర్గం పిటిషన్ వేసింది. ఆ అధికారంలో ఈసీకి లేదని ఉదవ్ ఠాక్రే వర్గం పిటిషన్ దాఖలు చేసింది. ఇరుపక్షాల పిటిషన్లు విచారించేందుకు సుప్రీం కోర్టు ప్రత్యేకంగా అయిదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో ఇరు పిటిషన్లపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం ఇవేళ శిండే వర్గానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అసలైన శివసేన ను గుర్తించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని, దానిని అడ్డుకునే అధికారం తమకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉద్దవ్ ఠాక్రే పిటిషన్ ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఆగస్టు 23న ఉద్దవ్ ఠాక్రే, ఏక్ నాథ్ శిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ల ను సుప్రీం కోర్టు.. అయిదుగురు న్యాయమూర్తుల బెంచ్ కు బదిలీ చేసింది. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల అనర్హత, తదితర రాజ్యాంగ బద్దమైన వివాదాల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.