Ugadi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను శనివారం ఘనం నిర్వహించుకున్నారు. ఏపి సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసిఆర్ లు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది అంతా రాష్ట్ర ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఏపిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్, భారతి దంపతులు హజరైయ్యారు. ఇక్కడి ఉగాది వేడుకల్లో పలువురు మంత్రులు, వైసీపీ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరాయ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శుభకృత్ నామ సంవత్సరం పేరుకు తగ్గట్టుగా ఈ ఏడాది కూడా అన్ని శుభాలే ఉంటాయని వెల్లడించారు. ప్రజల కోసం మంచి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు మరింత దగ్గర అవుతారని సిద్ధాంతి పేర్కొంటూ ఈ ఏడాది ఓర్పుగా ఏన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతారని, ప్రజలకు మంచి పాలన అందిస్తారని సీఎం జగన్ ను ఆశీర్వదించారు.
Ugadi Celebrations: ప్రగతి భవన్ లో
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో సిద్ధాంతి బాచుపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాగ శ్రవణం చేస్తూ ఈ ఏడాది సీఎం కేసిఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఇది ఉద్యోగ నామ సంవత్సరమని 75 శాతం మంచి ఫలితాలు కనిపిస్తుండగా, 25 శాతం వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు పొదుపు పాటించకపోతే శ్రీలంక పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యనేతలకు భద్రత పెరుగుతుందని, దేశంలో అలజడులు ఉంటాయని అన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచాన్ని శాసించే విధంగా ఎదుగుతుందని చెప్పుకొచ్చారు. సీఎం కేసిఆర్ మాట్లాడుతూ దేశానికి ఆదర్శరాష్ట్రంగా తెలంగాణ మారుతుందన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని మరో సారి పిలుపునిచ్చారు.
హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పంచాగ పఠనంలో పలు సంచలన విషయాలను వేద పండితులు శ్రీనివాసమూర్తి వెల్లడించారు. కేంద్రంలోని ఓ నాయకుడి మరణ వార్త దిగ్భాంతి కల్గిస్తుందని అన్నారు. ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు నిరంకుశ పాలనతో ప్రజాగ్రహాన్ని చవిచూస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుందని అన్నారు. అక్టోబర్ నెలలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశ్వరూపం చూపుతారని తెలిపారు. ఇలా వారి వారి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పండితులు పంచాగ శ్రవణం చేశారు. పార్టీ కార్యాలయాల్లో, ఆలయాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించి పండితులను ఘనంగా సత్కరించారు.