గుంటూరు జిల్లాలో మరో ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. పల్నాడు జిల్లా మాచర్ల లో జరిగిన విద్వంసం మరువకముందే తెనాలిలో అన్న క్యాంటిన్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. శనివారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత తెనాలిలోని అన్న క్యాంటిన్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సహాకారంతో మంటలను అదుపు చేశారు. ఈ సమయంలో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటిన్ లను మూసివేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తెనాలిలోని ఈ అన్న క్యాంటిన్ కు కూడా మూతపడింది. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న అన్న క్యాంటిన్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఓ పక్క మాచర్ల ఘటన, అది మరువక ముందే తెనాలిలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర సంచలనం అయ్యింది.