Ukraine Crisis: ఉక్రెయిన్ – రష్యా భీకర యుద్దం జరుగుతున్న నేపథ్యంలో అనేక మంది భారతీయులు అక్కడ నుండి స్వదేశానికి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులు, విద్యార్ధులను క్షేమంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి తరలిస్తోంది. ఇదే సమయంలో బాలీవుడ్ నటుడు, రియల్ హీరోగా పేరుగాంచిన సోనూసూద్ కు సంబంధించిన టీమ్ కూడా రంగంలోకి దిగింది. భారత ప్రభుత్వం విడుదల చేస్తున్న మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులకు తెలియజేస్తూ వారు సురక్షితంగా ఉక్రెయిన్ వీడే విధంగా సహాయ సహకారాలు అందిస్తోంది సోనూ సూద్ టీమ్.
Read More: TDP: టీడీఎల్పీలో భిన్నాభిప్రాయాలు.. అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం..!! చంద్రబాబు మినహా
Ukraine Crisis: ఉక్రెయిన్ లో సోనుసూద్ టీమ్ సేవలు
ఉక్రెయిన్ నుండి మధ్యప్రదేశ్ కు చేరుకున్న ఓ మహిళ సోనుసూద్ టీమ్ అందించిన సహాయ సహకారాలతో క్షేమంగా వచ్చినట్లు తెలిపింది. తనతో పాటు చాలా మంది భారతీయ విద్యార్ధులు సురక్షితంగా ఉక్రెయిన్ నుండి బయటపడ్డామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో నెటిజన్ లు సోనూసూద్ కు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సోనూ సూద్ సేవా గుణాన్ని టీమ్ సభ్యులు కొనసాగించడం పట్ల అభినందనలు తెలియజేస్తున్నారు.
కరోనా కష్టకాలంలో వేలాది మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేసి సోనూసూద్ రియల్ హీరోగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా అనేక రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి సోనూ సూద్ అపర దాన కర్ణుడుగా కీర్తించబడ్డారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సోనూ సూద్ సేవలకు ప్రశంసలు అందుకున్నారు.