ఉక్రెయిన్ పై నెలల తరబడి యుద్దం చేస్తున్న రష్యా .. కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. మరో పక్క ఉన్న వనరులతోనే ఉక్రెయిన్ సైన్యం రష్యాను ఎదుర్కొంటోంది. రష్యా క్షిపణి దాడులతో ఉక్రెయిన్ లో భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తొంది. ఉక్రెయిన్ లోని కొన్ని నగరాలు, పట్టణాలు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. తాజాాగా రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఉక్రెయిన్ లోని 53 మంది యుద్ద ఖైదీలు మృతి చెందగా మరో 75 మంది గాయపడ్డారు. మరియపోల్ నగరం హస్తగతం అయిన తరువాత యుద్ద ఖైదీలుగా చిక్కిన ఉక్రెయిన్లను రష్యా అనుకూల వేర్పాటు వాదులు ఒలెనివ్ కా జైలులో ఉంచారు. ఈ జైలుపై శుక్రవారం జరిపిన భీకర రాకెట్ దాడిలో 53 మంది చనిపోయారు. అయితే ఈ ఘటనపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
అమెరికా రాకెట్ లాంఛనర్లతోోనే ఉక్రెయిన్ బలగాలు ఈ దాడి చేశాయని రష్యా ఆరోపిస్తోంది. ఘటన ప్రాంతంలో పడిన ఆమెరికా తయారీ రాకెట్ విడిభాగాలను కనుగొన్నట్లు అధికార నొవొస్తి వార్త సంస్థ తెలిపింది. జైలుపై జరిగిన దాడి ఘటనలో గాయపడిన వారిలో 8 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లెప్టినెంట్ జనరల్ ఇగార్ కొనాషెంకోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ లపై చిత్ర హింసలు, మరణ శిక్షణల అమలును కప్పిపుచ్చుకునేందుకు రష్యానే ఈ దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మరో పక్క డొనెట్స్క్ లో రష్యా దాడులు తీవ్రతరం కావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఉక్రెయిన్ అధికారులు సూచించారు.