Ukraine Russia War: రష్యా సేనలు రెండు వారాలకు పైగా దాడులు కొనసాగిస్తున్నా ఉక్రెయిన్ లొంగడం లేదు. భారీ ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం జరుగుతున్నా ఉక్రెయిన్ సేనలు రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. దీంతో రష్యా సేనలు నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు, పౌరులు మృత్యువాత పడ్డారు. తాజాగా ల్వీవ్ నగరం వద్ద ఓ సైనిక స్థావరంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 35 మంది చనిపోయి ఉంటారనీ, 134 మంది గాయపడ్డారని ఆ ప్రాంత గవర్నర్ మాక్సిమ్ కోజిట్వ్కీ వెల్లడించారు.
Ukraine Russia War: కాల్పుల్లో అమెరికా జర్నలిస్ట్ మృతి
ఆదివారం జరిగిన దాడుల్లో అమెరికాకు చెందిన జర్నలిస్ట్ బ్రెంట్ రెనౌడ్ మృతి చెందారు. రష్యా దాడులపై ఉక్రెయిన్ లో గ్రౌండ్ లెవల్ లో రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో అతను మృతి చెందినట్లు ఉక్రెయిన్ సైనికాధికారులు తెలిపారు. కాల్పుల్లో మృతి చెందిన బ్రెంట్ వద్ద ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా అతను న్యూయార్క్ టైమ్స్ కు చెందిన జర్నలిస్ట్ గా అధికారులు గుర్తించారు. మరో ఇద్దరు జర్నలిస్ట్ లు కూడా తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. జర్నలిస్ట్ మృతిపై పలు పాత్రికేయ సంఘాలు సంతాపం తెలిపాయి.
Ukraine Russia War: భారత రాయబార కార్యాలయం పోలెండ్ కు తరలింపు
ఉక్రెయిన్ లో రష్యా సైనికుల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలెండ్ కు తరలిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది.