రాజకీయాల్లో రక్త సంబంధాలు, బంధుత్వాలు పనిచేయవు. సాక్షాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుష్పశ్రీవాణికే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది.
ఆ కుటుంబం లో మామ కోడలు మధ్య రంజైన రాజకీయం సాగుతోంది.మధ్యలో ముఖ్యమంత్రి జగన్ నలిగిపోతున్నారంటారు. పుష్పశ్రీవాణి మామలు ఢక్కా మెక్కీలు తిన్న రాజకీయ నేతలు.కురుపాం రాజవంశీకులుగా ఉన్న శత్రుచర్ల కుటుంబం నుంచి వచ్చిన వారు. మాజీ మంత్రి, టిడిపి నేత శత్రుచర్ల విజయరామరాజు శ్రీవాణికి పెద మామ అవుతారు. ఇక సొంత మామ చంద్రశేఖరరాజు కూడా మాజీ ఎమ్మెల్యే. ఆయన కూడా ఈ మధ్యన కోడలి పాలన మీద విమర్శలు సంధించారు.
రాజకీయాల్లో తలపండిన విజయరామరాజు కోడలి మీద పై చేయి కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. లేటెస్ట్ గా ఆయన తన శిష్యుడు టీడీపీ ఎమ్మెల్సీ ద్వారంపూడి జగదీష్ ని వైసీపీలోకి పంపేందుకు దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం .కోడలు పుష్ప శ్రీవాణి హవాను అడ్డుకునేందుకు ఆయన జగదీష్ ని బాణంగా వదులుతున్నారని చెబుతున్నారు.కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మామ కోడలు దారులు వేరే అయ్యాయి. కొత్త గిరిజన జిల్లాగా పార్వతీపురం కావాలని రాజు గారు ఎత్తులు వేస్తున్నారు. ఇది చిరకాల డిమాండ్ అంటూ ఓ వైపు టీడీపీ ఆద్వర్యాన సంతకాల సేకరణ కూడా జరుగుతోంది. దానికి వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు కూడా మద్దతుగా ఉంటున్నాయి. నిజానికి పార్వతీపురం విజయనగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది.
అప్పట్లోనే జిల్లా చేయాలని డిమాండ్ ఉంది. దానికి తోడు 2009 వరకూ ఎంపీ సీటుగా కూడా ఉన్న పార్వతీపురం జిల్లా కావడానికి జగన్ చెప్పిన ప్రమాణం సరిపోతుందని వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్వతీపురాన్నే జిల్లాగా చేయాలని అంటున్నారు.ఇక ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కురుపాంను జిల్లాగా చేయాలని ఉంది. ఆమె అందుకోసమే జగన్ ని అడిగి మరీ రెండవ గిరిజన జిల్లాగా అనుమతి తెచ్చుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున నియోజకవర్గం జిల్లా అయితే రాజకీయంగా అడ్వాంటేజ్ తనకు దక్కుతుందని ఆమె లెక్కలు వేసుకుంటున్నారు.
అరకు ఒక జిల్లాగా ఉంటే రెండవ జిల్లా కురుపాం అవుతుందని కూడా పుష్ప శ్రీవాణి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి!ఈ పంచాయతీ జగన్ దాకా వెళ్లిందని కూడా సమాచారం ఆయన స్పందన కోసం ఉప ముఖ్యమంత్రి ఎదురుచూస్తున్నారట!ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. కానీ పుష్ప శ్రీవాణి మాత్రం రచ్చ గెలుస్తోంది కానీ ఇంట గెలవలేకపోతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.