Undavalli Arun Kumar: రాష్ట్ర విభజన అంశంపై మాజీ ఎంపి, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాన మంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగిందని, విభజన సమస్యలు అలానే ఉన్నాయని మాట్లాడినప్పుడైనా రాష్ట్రంలోని పార్టీలు పార్లమెంట్ వేదికగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. విభజన బిల్లు ఆమోదం సమయంలో పార్లమెంట్ లో జరిగింది మామూలు తప్పు కాదు ఘోరమైన తప్పు జరిగిందన్నారు. చర్చ జరగకుండా రాష్ట్ర విభజన ఏమిటి అని నాడు బీజేపీ కూడా మాట్లాడలేదన్నారు.
Undavalli Arun Kumar: వైసీపీ, టీడీపీ ఎంపీలు లోక్ సభలో నోటీసు ఇవ్వాలి
కేవలం రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్, బీజేపీలు ఏపిని విడగొట్టాయని ఆయన మండిపడ్డారు. విభజన వల్ల ఏపికి పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. చర్చ లేకుండానే విభజన బిల్లు ఆమోదించారనీ, రాజధాని లేకుండానే ఒక రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. ఏపిలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ వ్యాఖ్యలపై చర్చ జరిగితే ఏపికి జరిగిన అన్యాయం దేశానికి తెలుస్తుందన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగి ఏనిమిదేళ్లు అయ్యిందనీ ఇప్పటికైనా దీనిపై వైసీపీ, టీడీపీ ఎంపీలు లోక్ సభలో ఒక నోటీసు ఇవ్వాలన్నారు. ఏపికి అన్యాయం జరిగిందంటూ మోడీ చెప్పింది వాస్తవమనీ, ఆయన మాటలను పూర్తిగా సమర్ధిస్తూనే నోటీసు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినప్పుడు సభలో తలుపులు మూసేస్తే జరిగిన పరిణామాలు ఏంటో బయట పెట్టాలన్నారు.
మౌనంగా ఉంటే ముందు తరాలు దారుణంగా నష్టపోతాయి
అన్యాయంపై అడగడానికి భయమెందుకు అని ఉండవల్లి ప్రశ్నించారు. మౌనంగా ఉంటే ముందు తరాలు దారుణంగా నష్టపోతాయని ఉండవల్లి అన్నారు. ఆంధ్రాకు ఏమి చేసినా అడిగేవారు లేరని అనుకుంటారని అన్నారు. జరిగిన నష్టంపై కోర్టుకీ వెళ్లరని పేర్కొన్నారు. తాను కోర్టులో పిటిషన్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేయలేదన్నారు. నాడు చంద్రబాబు హయాంలో కౌంటర్ వేయలేదు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కోర్టులో కౌంటర్ వేయలేదన్నారు. ప్రశ్నించే ప్రాంతీయ పార్టీల నేతలపై బీజేపీ కేసులు పెడుతోందని, రాబోయే రోజుల్లో ఏపిని అసలు పట్టించుకోరని ఉండవల్లి అన్నారు. జగన్మోహనరెడ్డి కేంద్రానికి ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావట్లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.