పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగానే ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలవరంపై ఇంతవరకు శ్వేతపత్రం విడుదల చేయలేదని మండిపడ్డారు. అనుకున్న డిజైన్ ప్రకారం పోలవరం నిర్మాణం జరగకపోతే రాష్ట్రం నష్టపోతుందని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఎగువన ఉన్న తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణాలను నిలిపివేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. పోలవరం విషయంలో ప్రభుత్వాలు ప్రజలకు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి జీవనాడి ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో అధికారంలో ఉన్న వారు తప్పులు చేస్తే ప్రజలు కచ్చితంగా సరైన రీతిలో స్పందిస్తారని అధికార పార్టీని ఉండవల్లి హెచ్చరించారు. ఇదిలా ఉండగా జగన్ సర్కార్ 2022వ సంవత్సరం కల్లా పోలవరం ప్రాజెక్టు ను కంప్లీట్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. మరోపక్క పరిస్థితి చూస్తే పోలవరం ప్రాజెక్టు పనుల లో ఆలస్యం జరుగుతున్నట్లు విపక్షాలు మండిపడుతున్నాయి. ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టు విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ గత కొంత కాలం నుండి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరి ఈసారి జగన్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేస్తుందో లేదో చూడాలి.