తనపై వైసిపిలో కుట్ర జరుగుతోందని, ఒక నేత తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాడని ఆరోపించడం ద్వారా తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మరో తేనెతుట్టెను కదిపారు.ఇప్పుడు ఆ నేత ఎవరు అన్నదే వైసిపిలో చర్చనీయాంశమైంది.
అసలే పేకాట క్లబ్బులు నడపడం ద్వారా వచ్చే పర్సంటేజీల విషయమై తన అనుచరుడు సందీప్ తో ఉండవల్లి శ్రీదేవి ఫోన్లో మాట్లాడిన ఆడియో టేప్ బయటకు వచ్చి వైసిపి భ్రష్టు పట్టిపోతున్న తరుణంలో సదరు ఎమ్మెల్యే తనను సమర్థించుకోవడం కోసం ఇదంతా కుట్ర అని దీని వెనుక మరో నేత ఉన్నాడని చెప్పటం అధికార పార్టీకి ఇంకో తలనొప్పిగా మారింది.ఉండవల్లి శ్రీదేవి, సందీప్ ల మధ్య జరిగిన ఆడియో సంభాషణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఉండవల్లి శ్రీదేవి పేకాటను ప్రోత్సహిస్తున్నారని, అందులో పేకాట క్లబ్ ల నిర్వహణపై ఆమె పర్సంటేజ్ ల విషయంపై వైసిపి బహిష్కృత కార్యకర్త సందీప్ తో గతంలో చర్చించిన విషయాలు ఉన్నాయి.
అయితే ఆ ఆడియో రాష్ట్రంలో దుమారంగా మారగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆడియో విషయం పై స్పందించారు .తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు.ఆ ఆడియోలో తన వాయిస్ ను మార్ఫింగ్ చేసి వాడుకున్నారని,అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందువల్ల పోలీసులు ఈ కోణంలో నుండి కూడా దర్యాప్తు చేసి అసలు నిజం బయట పెట్టాలని ఆమె కోరారు. ఆ ఇద్దరి వెనుక వైసిపి నేత మరొకరు ఉండి ఇదంతా నడిపిస్తున్నారని ఈ విషయమై పార్టీ అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.ఇటీవల ఉండవల్లి శ్రీదేవి తనకు ఇద్దరు వైసిపి కార్యకర్తల వల్ల ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి మీద కేసు నమోదు కావడం తెలిసిందే.
వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వారిద్దరి లో ఒకడైన సందీప్ తనతో పేకాట క్లబ్బులు విషయమై ఎమ్మెల్యే శ్రీదేవి ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపును విడుదల చేయగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు అనిత అయితే ఏకంగా రాష్ట్రంలో కాయ్ రాజా కాయ్ పాలన సాగుతోందని దుమ్మెత్తిపోశారు.వైసిపికి ఇప్పటికే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి చికాకు తెప్పించారు.ఇంతటితో ఆమె ఆగకుండా ఈ వివాదంలోకి మరో వైసిపి నేతను లాక్కురావడం పరిస్థితిని మరింత జఠిలంగా మార్చింది.ఉండవల్లి శ్రీదేవి వ్యవహారంలో సీరియస్గా ఉన్న జగన్ ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?