వైయస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కి పెద్దగా రాజకీయ బలం లేకపోయినా అతనికి ఉన్న మేధా శక్తికి మరియు పరిస్థితి అవగాహన నైపుణ్యానికి రాజశేఖర్ రెడ్డి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఇక కాలం గడిచిపోయింది ఇప్పుడు అతని కొడుకు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవ్యాంధ్ర రాజధాని అమరావతి ని నెమ్మదిగా నిర్వీర్యం చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్ర రాజధానిని మూడు ముక్కలుగా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
జగన్ పాలన మొదలు పెట్టినప్పటి నుండి ఆయనను వెనకేసుకుని వస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు ఒక్కసారిగా జగన్ కు యాంటీగా మాట్లాడడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఉండవల్లి అరుణ్ కుమార్ అమరావతి విషయమై మాట్లాడుతూ చంద్రబాబు చెప్పుకున్నంత కాకపోయినా అమరావతిలో నిర్మాణాలు బాగనే జరిగాయని…. ఇప్పుడు ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్ అక్కడే ఉన్నాయి అని…. కానీ ఆయన వైసీపీ ఆరోపిస్తున్నట్లు స్మశానం లాంటిది ఏమీ లేదని అన్నారు. ఇక అమరావతిని రాజధాని హోదా నుండి మార్చడం ఎవరితరం కాదని రాజధాని మార్పు అసలు జరిగే పని కాదని తేల్చి చెప్పడం గమనార్హం.
ఇకపోతే గతంలో జగన్ అమరావతికి ఒప్పుకోవడం మరియు ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్లు మార్చడం…. ఇవన్నీ కుదరదు అని అన్న అరుణ్ కుమార్…. మోడీ శంకుస్థాపన చేసి డబ్బులు ఇచ్చిన చోటు నుండి వేరే చోటుకు తాను రాజధానిని తరలిస్తాను అంటే అది జరిగే పని కాదని అన్నారు. ఎప్పుడూ తనకి వెన్ను దన్నుగా ఉండే ఉండవల్లి రాజధాని విషయంలో ఇలా ఒక్కసారిగా వ్యతిరేక ధోరణి కనబరచడం జగన్ కు రాబోయే రోజుల్లో అతని మాటలను తప్పు అని నిరూపించడం పెను సవాల్ గా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.