ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాష్ జవడేకర్, దర్మేంధ్ర ప్రదాన్ మీడియాకు వెల్లడించారు.
ఏపిలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సహా కర్నాటకలోని తుమకూరులో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే యూపీలోని గ్రేటర్ నోయిడాలో మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ అండ్ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్టు హబ్ ఏర్పాటుకు నిర్ణయించింది. రూ.7,725 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. వీటి వల్ల సుమారు 2.8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేసింది.
నెల్లూరు జిల్లాలో ఓడరేవు ఉన్న కృష్ణపట్నంలో 2,139 కోట్లతో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కానున్నదనీ, దీని వల్ల సుమారు 98వేల ఉద్యోగాలు వస్తాయని జవడేకర్ తెలిపారు. అలాగే అకాశ్ క్షిపణి వ్యవస్థను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఏదైనా దేశం దరఖాస్తు చేసుకుంటే సత్వర అనుమతుల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. కేంద్ర మంత్రి థర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ పెట్రోల్ లో కలిపేందుకు ఉపయోగించే ఇథనాల్ ఉత్పత్తి కోసం కొత్తగా ఏర్పాటు చేయబోయే డిస్టిలరీలకు రూ.4,573 కోట్ల వడ్డీ రాయితీని అందించేందుకు తీర్మానించినట్లు తెలిపారు.