అమరావతి: తెలంగాణ క్యాడర్ ఐపిఎస్ అధికారి అయిన స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్పై ఆంధ్రప్రదేశ్ వచ్చేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఏపి ఇంటిలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర నియమానికి అడ్డంకులు తొలగిపోయాయి. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కేంద్రం నుండి తెలంగాణ ప్రభుత్వానికి అందనున్నాయి. అనంతరం స్టీపెన్ రవీంద్రను ఆంధ్రప్రదేశ్కు డిప్యుటేషన్పై పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ కోసం స్టీఫెన్ రవీంద్ర రెండు నెలలుగా సెలవులో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఐపిఎస్ స్టీఫెన్ రవీంద్రలు డిప్యుటేషన్పై ఇక్కడకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలవగా ఇక్కడ వారికి ప్రాధాన్యత పోస్టింగ్లు ఇవ్వడానికి సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు డిప్యుటేషన్పై వెళ్లేందుకు కేంద్రానికి ధరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరిని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రకు పంపేందుకు అనుమతించినప్పటికీ కేంద్రం నుండి అనుమతులు రాకపోవడంతో రెండు నెలలుగా విధులకు దూరంగా ఉండి ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
డిప్యుటేషన్ వ్యవహారంపైనే వారం రోజుల క్రితం ఐఎఎస్ శ్రీలక్ష్మి వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ద్వారా పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలవడంతో పాటు సీనియర్ ఐఎఎస్ అధికారులను కలిసి వచ్చారు. అయితే శ్రీలక్ష్మి డిప్యుటేషన్ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. స్టీఫెన్ రవీంద్రకు మాత్రం గ్రీన్ సిగ్నల్ లభించింది.