కరోనా మహమ్మారి మరో ముఖ్య నేతను పొట్టన పెట్టుకుంది. కరోనా సోకి ఇప్పటికే పలువురు మృత్యు వాత పడగా తాజాగా కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి కరోనా కారణంగా కన్నుమూశారు. సెప్టెంబర్ 11వ తేదీన సురేష్ అంగడికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది.
ఆ సందర్భంగా ఆయన తనకు కరోనా వచ్చిన విషయాన్ని తెలుపుతూ తనతో కాంటాక్ట్ అయిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. “నా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నా” అని తెలిపారు. అయితే ఆయనకు ఆరోగ్యం ఎంతకూ కుదుటపడకపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. 2004లో తొలిసారి బీజేపీ తరుఫున పోటీచేసి గెలిచిన ఆయన అప్పటినుండి వరసగా 2009, 2014, 2019 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు.