రాష్ట్ర విభజన తర్వాత మొదటి అయిదేళ్లలో ఏపికి పది జాతీయ సంస్థలు వచ్చాయని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాకినాడ జేఏన్టీయూ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) క్యాంపస్ ను శుక్రవారం కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏన్టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ట్రేడ్ హబ్ గా కాకినాడ దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించనుందని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మొదటి ఐదేళ్లలోనే ఏఐఐఎంఎస్, ఎన్ఐడీ, ఎన్ఏసీఐఎన్, ఐఐటీ, ఐఐఎస్ఇఈర్ సహా 10 అగ్ర స్థాయి జాతీయ సంస్థలు ఏపికి వచ్చాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎగుమతి సామర్థ్యాలతో ఏపి ప్రాముఖ్యత చాటుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విదేశీ వాణిజ్యానికి హబ్ గా నిలుస్తున్న కాకినాడలో ఐఐఎఫ్ టీ ఏర్పాటు ఎంతో కీలకమని అన్నారు. సుమారు 700 కిలో మీటర్ల తీర ప్రాంతం ఉన్న ఏపిలో ఎగుమతి అవకాశాలను ఈ ప్రాంత ఎంటర్ ప్రెన్యూర్లు అందిపుచ్చుకున్నారన్నారు. రాష్ట్రాలు తమ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఎగుమతి అవకాశాలను విస్తరించేందుకు విదేశీ ఎంబసీలలో ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ ఆఫీసుల ఏర్పాటునకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని ప్రధాని మోడీ సూచించారని కేంద్ర మంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒన్ డిస్ట్రిక్ట్ ఒన్ ప్రొడక్ట్ విధానంతో ఎన్నో స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. ఐఎంఎఫ్ టీ విద్యార్ధులు తమ కోర్సును కేవలం అకడమిక్ డిగ్రీ సాధనలా కాకుండా ప్రపంచ వాణిజ్య స్థితగతులు, సదవకాశాలను రీసెర్చ్ చేస్తూ విధాన రూపకల్పనల్లో కేంద్ర వాణిజ్య శాఖకు సూచనలు అందించాలని కోరారు. దేశ ఆర్ధిక పురోగతిలో నిర్మాణాత్మక భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఢిల్లోని క్యాంపస్, బ్రిటీష్ ప్రెసిడెన్సీ లో కొనసాగిన కలకత్తా లోని క్యాంపస్ కన్నా కాకినాడ ఐఐఎఫ్ టీ క్యాంపస్ భిన్నమైనదని అన్నారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ కాకినాడ ఐఐఎఫ్టీ క్యాంపస్ ఏర్పాటునకు నిర్మలా సీతారామన్ ప్రత్యేక చొరవ కారణమని అన్నారు. ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రత్యేక బడ్జెట్ దేశ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేశాయన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ 3.5 ట్రిలియన్ అమెరికా డాలర్లుగా ఉందని, వచ్చే 25 సంవత్సరాల్లో ఈ ఆర్ధిక వ్యవస్థను పది రెట్లు పెంచేలా కృషి చేస్తున్నామన్నారు. ఏపి వ్యవసాయం, మత్స్య తదితర రంగాల్లో ఎంతో వృద్ధి సాధిస్తొందని కేంద్ర మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీదిరి అప్పలరాజు. కారుమూరి నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జీవీఎల్ నర్శింహరావు, రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.