(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యులు మొదలుకుని అనేక మంది ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. చికిత్స అనంతరం దాదాపుగా అందరూ కోలుకుంటున్నారు. హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో కేంద్ర మంత్రి కరోనా బారిన పడ్డారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కరోనా సోకింది. ఈ విషయాన్నే ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. అయితే కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ ఎటువంటి లక్షణాలు లేకపోవడం వల్ల హోం క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ప్రహ్లాద్ జోషి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో సుందరకాండ పఠనంలో పాల్గొన్నారు.