ఇటీవల కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ రానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు. అనంతరం ప్రభాస్ తో పాటు దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులను రాజ్ నాథ్ సింగ్ పరామర్శించనున్నారు. తదుపరి ఫిల్మ్ నగర్ లో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ పాల్గొంటారు. సాయంత్రం 4.20 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
మరో వైపు భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు రాత్రి హైదరాబాద్ రానున్నారు. రాత్రి 9.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. రాజేంద్ర నగర్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమిలో బస చేస్తారు. రేపు (శనివారం) ఉదయం 8.45 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే విమోచన అమృతోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఏడు కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని అమిత్ షా స్వీకరిస్తారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. 1300 మంది కళాకారుల ప్రదర్శనను తిలకిస్తారు. అనంతరం టూరిజం ప్లాజాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ ముఖ్యనేతలతో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ కు చేరుకుని మోడీ పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేస్తారు. అక్కడి నుండి సాయంత్రం పోలీస్ అకాడమికి చేరుకుని అమిత్ షా రాత్రి ఢిల్లీకి తిరిగి పయనమవుతారు.