సోషల్ మీడియాలో రాజకీయ వ్యాఖ్యలు
పుల్వామా ఉగ్రవాద దాడిపై ప్రశ్నలు
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ పై ప్రశంసలు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ టీచర్ల నిర్వాకం
లక్నో: పాఠాలు చెప్పుకోవాల్సిన టీచర్లు సస్పెండై ఇంట్లో కూర్చున్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఏడుగురు టీచర్లు ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపులలో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు పెట్టినందుకు సస్పెండయ్యారు. వాళ్లు పుల్వామా ఉగ్రవాద దాడిపై ప్రశ్నించడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ప్రశంసించడం, బాలాకోట్ వాయుసేన దాడుల సమర్ధతను విమర్శించడం లాంటి పనులు చేశారు. గ్రూప్-ఎ విద్యాశాఖాధికారిని కూడా సస్పెండ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేయడంతో పాటు, ఒక ప్రైవేటు స్కూలు టీచరుపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సస్పెండ్ చేయడానికి ముందు తగిన విచారణ చేశామని యూపీ అదనపు ముఖ్య కార్యదర్శి ప్రభాత్ కుమార్ ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు చెప్పారు.
ముజఫర్ నగర్ బీఎస్ఏ దినేష్ యాదవ్ ఫిబ్రవరి 21న సస్పెండయ్యారు. పుల్వామా ఉగ్రవాద దాడిని ప్రశ్నించడమే కాక, దానివెనుక ఏదో కుట్ర ఉందని వాట్సాప్ గ్రూపులో పెట్టారు. అది తన అధికార బాధ్యతను ఉల్లంఘించినట్లయింది. బారాబంకిలోని ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ సురేంద్రకుమార్ ఫిబ్రవరి 27న సస్పెండయ్యారు. ఒక సామాన్య పౌరుడిగా తాను పుల్వామా దాడి గురించి ప్రశ్నిస్తున్నానని వాట్సాప్ గ్రూపులో అన్నారు. ఇక సుల్తాన్ పూర్ ప్రాథమిక పాఠశాల అసిస్టెంట్ టీచర్ అమరేంద్రకుమార్ మార్చి 2న సస్పెండయ్యారు. శాంతి దూత ఇమ్రాన్ ఖాన్ కు సెల్యూట్ అని ఆయన టీచర్ల గ్రూపులో పెట్టాడు. ఇక రాయ్ బరేలీ ప్రాథమిక పాఠశాల అసిస్టెంట్ టీచర్ రవీంద్రకుమార్ మార్చి 6న సస్పెండయ్యారు. మన విమానం పాక్ లో కూలిపోయి, పైలట్ వారికి దొరికతే బాలాకోట్ ఎలా విజయవంతం అయినట్లవుతుందని ఫేస్ బుక్ లో ప్రశ్నించాడు. అది తాను రాయలేదని, తన ఫోన్ తీసుకుని ఎవరో రాశారని ఆయన అంటున్నాడు. ఇక మీర్జాపూర్ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ రవిశంకర్ యాదవ్ అయితే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురించి విమర్శించారు. నందజీ యాదవ్ అనే మరో ఉపాధ్యాయుడు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి పదే పదే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇలాగే ఇంకా పలువురు ఉపాధ్యాయులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకు సస్పెండయ్యారు.