వాషింగ్టన్: రెండుసార్లు ప్రమాదాలకు గురైనా, బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలను తాము నిషేధించేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఇప్పటికే భారత్, చైనా, సింగపూర్, ఈయూ, బ్రిటన్ తదితర ప్రభుత్వాలు ఈ తరహా విమానాలను కొంతకాలం పాటు ఎగరేసేది లేదని చెప్పాయి. ఈ విమానం ప్రయాణానికి సురక్షితం కాదన్న వాదనలు వస్తున్నాయి. కానీ తమ దేశానికే చెందిన బోయింగ్ కంపెనీ నుంచి బాగా అమ్ముడయ్యే ఈ విమానాల ప్రయాణాన్ని ఆపేది లేదని అమెరికా అంటోంది. తమ సమీక్షలలో విమానం పనితీరులో ఎలాంటి సమస్యలు లేవని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ డేనియల్ ఎల్వెల్ తెలిపారు.
గత అక్టోబరులో లయన్ ఎయిర్ సంస్థకు చెందిన ఇదే విమానం కూలి 189 మంది మరణించారు. తాజాగా ఇథియోపియాకు చెందిన ఈ విమానం కూలి 157 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ మీద ఒత్తిడి పెరిగింది. ఈ విమానాలు ఎంతవరకు సురక్షితమో చెప్పాలని డిమాండ్లు వస్తున్నాయి. విమాన సాఫ్ట్ వేర్ ఏప్రిల్ నాటికి అప్ డేట్ అవుతుందని, దాంతో సెన్సార్ కూడా బాగా పనిచేస్తుందని కంపెనీ అంటోంది. ప్రపంచవ్యాప్తంగా మాక్స్ 8 తరహా విమానాలు 350 ఉన్నాయి. ఎయిర్ కెనడా కూడా తాజాగా ఈ విమానాలను ఆపేస్తున్నట్లు చెప్పింది.
మరోవైపు భారతదేశంలో మాత్రం బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలను కొంతకాలం నడిపేది లేదని డీజీసీఏ స్పష్టం చేసింది. ఆ విమానాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే చూస్తామని చెప్పింది. తమ సిబ్బంది, ప్రయాణికుల ప్రాణాలు చాలా ముఖ్యమని తెలిపింది. న్యూజిలాండ్ కూడా తాత్కాలికంగా ఈ విమానాలను తమ గగనతలంలో ఎగరనిచ్చేది లేదంది. ప్రపంచంలో అతిపెద్ద విమానయాన సంస్థలలో ఒకటైన టర్కిష్ ఎయిర్ లైన్స్ కూడా ఇదే బాటలో నడిచింది. నార్వే, దక్షిణకొరియా, దక్షిణాఫ్రికా కంపెనీలు ఎయిర్ షటిల్, ఈస్టర్ జెట్, కామ్ ఎయిర్ కూడా ఈ విమానాలను సస్పెండ్ చేశాయి.