ఎంత అడ్డగోలు వాదనలు చేసినా, ఎంత నంగనాసి కబుర్లు చెప్పినా… కరోనా విషయంలో చైనా ప్రపంచం ముందు దోషిగా నిలబడిందనే మెజారిటీ అభిప్రాయం. ఈ క్రమంలో కరోన విషయంలో చైనా మొదటినుంచీ నిజాలను దాస్తూనే ఉంది.. ప్రపంచాన్ని మోసం చేస్తూనే ఉంది. ఈమేరకు చైనా చేసిన మరో మోసాన్ని ప్రపంచానికి తెలియజేసే పనిచేశారు అమెరికాలోని హార్వర్డ్, బోస్టన్ విశ్వవిద్యాలయాల నిపుణులు.. దీంతో కరోనా విషయంలో చైనాపై ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆరోపణలు నిజమేననే కామెంట్లు మరీ పెరుగుతున్నాయి.
వివరాళ్లోకి వెళ్తే… కరోనా వైరస్ ను తాము ముందుగా డిసెంబర్ లో గుర్తించామని చైనా ఇప్పటి వరకూ ప్రపంచాన్ని నమ్మిస్తోన్న సంగతి తెలిసిందే. కానీ అసలు వాస్తవం అది కాదని.. గత డిసెంబరులో కాకుండా, అంతకుముందు ఆగస్టులోనే వుహాన్ లో ఈ మహమ్మారి వైరస్ బయటపడిందని చెబుతున్నారు అమెరికాలో నిపుణులు. ఇది ఆరోపణ మాత్రమే కాదని వారు రుజువులు చూపిస్తున్నారు. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం… శాటిలైట్ పిక్చర్స్.
అవును… ఆగస్టు నెలాఖరు నుంచి డిసెంబరు వరకూ వుహాన్ లోని ఐదు ఆసుపత్రుల వద్ద వాహనాల రద్దీ అంతకంతకూ పెరిగిందని.. ఈ విషయం ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు సైంటిస్టులు. వుహాన్ ఆసుపత్రుల పరిసరాలకు సంబంధించి 2018-19 మధ్య వాణిజ్య ఉపగ్రహాలు చిత్రీకరించిన పలు దృశ్యాలను, డేటాను పరిశోధకులు విశ్లేషించి చైనా గుట్టు బయటపెట్టారు. చైనాలో ఆగస్టులోనే అక్కడి జనం దగ్గు, విరేచనాలు వంటి కరోనా లక్షణాల గురించి తెలుసుకోవడానికి ఆన్ లైన్ లో కూడా ఎక్కువగా సెర్చ్ చేశారట.
ఇదే క్రమంలో 2018 అక్టోబరులో వుహాన్ లోని అతిపెద్ద టియాన్యూ ఆసుపత్రి వద్ద మొత్తం 171 కార్లు నిలిపి ఉంచారట. 2019లో అదే సమయంలో అక్కడ 285 వాహనాలు ఉన్నట్టు లెక్క తేలిందట. అంటే 67% ఎక్కువగా ఆసుపత్రి వద్ద వాహనాలు నిలిపినట్టు లెక్క.. ఇలా పెద్ద సంఖ్యలో వాహనాలు ఆస్పత్రుల వద్ద నిలపడం అసాధారణమని, ఇదంతా కరోనా వల్లనే జరిగిందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.