కరోనా మహామ్మారి అగ్రరాజ్యం అమెరికాను తీవ్రంగా వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్న సంగతి విదితమే. ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్, అధ్యక్షుడిని భద్రత బాధ్యతలు నిర్వహించే 130 మందికిపైగా సీక్రెట్ సర్వీసెస్ అధికారులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని వాషంగ్టన్ పోస్టు వెల్లడించింది. ట్రంప్ ప్రచార ర్యాలీ ద్వారా వీటికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా సీక్రెట్ సర్వీసెస్ ఏజన్సీ బృందంలో పది శాతం మందిని దూరంగా పెట్టినట్లు సమాచారం. కరోనా విజృంభణ ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకూ దాదాపు మూడు వందల మంది సీక్రెట్ సర్వీసెస్ అధికారులు, ఏజంట్లు కరోనా బారిన పడి క్వారంటైన్ లో గడిపారు.
ట్రంప్ ప్రచార ర్యాలీ అనంతరం వైట్ హౌస్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మోడోస్, అవుట్ సైడ్ పొలిటికల్ అడ్వయిజర్ కోరీ లెవానండౌస్కీ, డేవిడ్ బోసీలకు కోవిడ్ 19 పొజిటివ్ నిర్ధారణ అయ్యింది. అమెరికా వ్యాప్తంగా రోజుకు లక్షన్నరకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి.