అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనం (పార్లమెంట్)లోకి దూసుకువెళ్లి వీరంగం సృష్టించారు. బారికేడ్లు దాటుకుని వెళ్లి పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందింది. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణలో మహిళ మెడపై తూటా గాయమైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది.
అమెరికా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ గెలుపును దృవీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశమైంది. ఈ క్రమంలో బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాపిటల్ భవనంలోకి దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ సైతం ప్రయోగించారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో బైడెన్ గెలుపు దృవీకరణ ప్రక్రియకు ఆటంకం కలిగింది. ఆందోళనకారులను అదుపుచేసేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ట్రంప్ ఆదేశాలతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ తరుణంలో ఆందోళనకారులు సంయమనం పాటించాలనీ, పోలీసులకు సహకరించాలని ట్రంప్ తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వాషింగ్టన్ మేయర్ బౌజర్ నగరంలో కర్ప్యూ విధించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రక్షణ బలగాలు క్యాపిటల్ భవనంను తమ అధీనంలోకి తీసుకున్నాయి.
ఈ ఘటనపై అమెరికా చట్టసభ ప్రతినిధులు తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేశారు. సెనేటర్ మిచ్ మెకానెల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వంటిదేనని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చట్టసభ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఆందోళనకారుల చర్యలను ఆయన ఖండించారు.
కాగా నవంబర్ మూడవ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికల్లోనూ 306-232 ఓట్ల తేడాతో జోబైడెన్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ట్రంప్ తన ఓటమిని అంగీకరించలేదు. ఫలితాన్ని తారు మారు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే జార్జియా ఎన్నికల చీఫ్నకు ట్రంప్ చేసిన ఫోన్ కాల్ ఆడియో లీక్ అవ్వడం తీవ్ర కలకలాన్ని కల్గించింది. ట్రంప్ మరో సారి బుధవారం తన మద్దతు దారులను ఉద్దేసించి మనం దేనినీ వదిలే ప్రసక్తే లేదు అంటూ ప్రసంగించడంతో ఆందోళనలు చెలరేగాయి.
ఈ ఘటనలపై అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ స్పందించారు. ఈ చర్యలు ఇంతటితో ఆపాలని, ఆందోళనకారులను నిలువరించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ట్రంప్ వెంటనే జాతీయ ఛానల్ లో ప్రకటన ఇవ్వాలంటూ జో బైడెన్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
#WATCH | Supporters of outgoing US President Donald Trump hold a demonstration at US Capitol in Washington DC as Congress debates certification of Joe Biden's electoral victory. pic.twitter.com/c7zCgg9Qdu
— ANI (@ANI) January 6, 2021