దక్షిణ కరొలినా: అది చల్లగా ఉండే అక్టోబరు సమయం.. అమెరికాలోని దక్షిణ కరొలినా ప్రాంతంలో ఓ మహిళ గ్రీన్ విల్లే అనే ప్రాంతంలో కారులో వెళ్తున్నారు. అంతలో ఆమెకు ఒక హోర్డింగ్ కనిపించింది. రూ. 10 వేల కోట్లకు పైగా మెగా జాక్ పాట్ లాటరీ గురించిన ప్రకటన అది. మనకు వస్తుందా అనుకున్నా, సరే అదృష్టం చూసుకుందామని ఆగి, టికెట్ కొంది. ఎటూ రాదని ఆమె గట్టిగా నిర్ధారించుకున్నారు. కానీ, డ్రా తీసిన తర్వాత ఒకసారి ఎందుకైనా మంచిదని చూసుకుని ఒక్కసారిగా షాక్ తిన్నారు. తన టికెట్ వైపు, లాటరీ ఫలితం వైపు అలాగే చూస్తూ కొన్ని గంటల పాటు ఉండిపోయారు. జీవితంలో ఎప్పుడూ అనుకోని ఘటన ఆమెకు ఎదురైంది. మొత్తం 10వేల కోట్ల రూపాయల జాక్ పాట్ బంపర్ లాటరీ ఆమెకే తగిలింది. ఆ తర్వాత ఒకసారి చెయ్యి గిల్లుకుని మళ్లీ టికెట్ చూసుకుంది. చివరకు తనకే ఆ లాటరీ తగిలిందని ఖరారు చేసుకుంది.
పన్నులు పోను వచ్చేదిదే..
పన్నులు అన్నీ పోగా ముందుగా ఆమెకు ఒకేసారి రూ. 6077 కోట్లు అందిస్తామని దక్షిణ కరొలినా లాటరీ నిర్వాహకులు చెప్పారు. అయితే భద్రతా కారణాల రీత్యా ఆ మహిళ తన పేరు, వివరాలు చెప్పడానికి నిరాకరించారు. ఈ వారంలోనే ఆమె తనకు బహుమతిగా అందిన మొత్తాన్ని తీసుకోడానికి ముందుకొచ్చారు. ఇలాంటి అనుకోని అదృష్టాన్ని మాటల్లో చెప్పలేమని ఆమె ఓ ప్రకటనలో చెప్పారు. ఇలాంటి అదృష్టం తగలడంతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుందన్నారు. తన మనసుకు నచ్చిన చారిటీలకు సాయం చేయడానికి ఇదే తనకు మంచి అవకాశమని అన్నారు.
దోచుకునేవాళ్లు సిద్ధం..
లాటరీలు గెలుచుకున్నవారు తమ పేరు బయటపెట్టకుండా ఉండగలిగే కొన్ని రాష్ట్రాలలో దక్షిణ కరొలినా ఒకటి. అంత డబ్బు వచ్చిందని తెలిస్తే దోచుకోడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బోగస్ చారిటీలు.. ఇలా అందరూ బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుతారు. సోషల్ మీడియా ద్వారా కూడా వివరాలు ఇట్టే తెలిసిపోతాయని ఆమె తరఫు న్యాయవాది కర్లాండ్ చెప్పారు. బహుశా తనకు చేతికి వచ్చిన మొత్తంలో సగం వరకు ఆమె దానధర్మాలకు వెచ్చించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకు వర్గాలకు కూడా ఈ విషయం తెలియజేయాలని, ఒకేసారి ఆమె ఖాతాలో ఇంతమొత్తం పడితే వాళ్లూ అనుమానిస్తారని అన్నారు.