తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దుబ్బాక మరియు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయగా… ఆ పదవిని ఎవరికీ కట్టబెట్టాలి అన్న దాని విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ ని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో భేటీ అయి వారి దగ్గర అభిప్రాయాలను తీసుకుని, ఒక నివేదిక రూపంలో హైకమాండ్ కి ఠాగూర్ ఇవ్వటం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో పిసిసి అధ్యక్ష పదవి విషయంలో కొంతమంది పేర్లు వినబడుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పదవిని ఠాగూర్ చేపట్టిన నాటి నుండి పార్టీలో సీనియర్ నాయకుడు అయిన వి హనుమంత రావు ఆయనపై రుసరుసలాడుతున్నే ఉన్నారు. పీసీసీ పదవి విషయంలో ఠాగూర్ కి డబ్బులు అందినట్లు ఇటీవల కామెంట్లు చేయడం జరిగింది. అంతకుముందు కూడా అనేక విషయాలలో ఠాగూర్ పై విహెచ్ అనేక ఆరోపణలు చేయడంతో ఇద్దరు ఎపిసోడ్ గాంధీ భవన్ వర్గాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే పీసీసీ పదవి ప్రకటన రాకముందే ప్రస్తుతం చేస్తున్న కామెంట్లు ఠాగూర్ తో పాటు హైకమాండ్ కి తలనొప్పిగా మారినట్లు దీంతో విహెచ్ పై క్రమశిక్షణా చర్యలు చేపట్టేలా ఠాగూర్ పొలిటికల్ ఎత్తుగడలు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.