Vaccination drive: రాష్ట్రంలో వాక్సినేషన్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వక్రబుద్ధి మరో సారి బయటపడిందని భాజపా అరోపించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలోని వ్యాక్సినేషన్ సెంటర్లను సోమువీర్రాజు నాయకత్వంలో పార్టీ నాయకబృందం సందర్శించింది. ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం 9.56 లక్షల వ్యాక్సిన్లు పంపితే వాటిని ముందురోజే వాడేసిన సిఎం వైఖరిని నిరసించింది. యువతకు అసలెందుకు వ్యాక్సిన్ వేయలేదని ప్రశ్నించింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా వ్యాక్సిన్లు తీసుకుని తామేదో ఘనకార్యం సాధించినట్లు ప్రచారం చేసుకోవడాన్ని భాజపా అధ్యక్షులు సోమువీర్రాజు తప్పుపట్టారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం జూన్ 21న దేశ వ్యాప్తంగా 18 ఏళ్ళు . దాటిన వారికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు పంపారు.
అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అన్ని రాష్ట్రాల్లో భాజపా నాయకులు ఆయా కేంద్రాలను సందర్శించాలని పార్టీ ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు, విశాఖపట్నం నగరంలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. కాని అన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్ స్వల్ప సంఖ్యలోనే జరిగింది. ఎక్కడికెళ్లినా వ్యాక్సిన్ లేదని, ఆదివారం రోజునే ఎక్కువ వేశామని, ఈరోజు కొద్దిగా మిగిలినవి మాత్రం వేశామని అధికారులు చెప్పారు.
కనీసం ఒక్క వ్యాక్సినేషన్ కేంద్రంలో కూడా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిన ప్రధాని మోదీ చిత్రం ఏర్పాటుచేయకుండా ముఖ్యమంత్రి జగన్ తన చిత్రాలే ఏర్పాటుచేసుకున్నారని ఇది పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పంపిన వ్యాక్సిన్లలో కనీసం సగమైనా యువతకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. 18 ఏళ్లు దాటిన వారికి ఉచిత వ్యాక్సిన్ చేయడానికి మరో రోజు ప్రకటించాలని డిమాండ్ చేశారు వీర్రాజు