Vijaya Sai:కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. విజయసాయి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ఘాటుగా స్పందించారు. విజయసాయికి మతిభ్రమించిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వడ్డే. ఏ రోజైనా అశోక్ గజపతిరాజు జైలుకు వెళ్లకతప్పదని విజయసాయి అనడం చూస్తే ఆయన మానసిక స్థితి సరిగా లేదని స్పష్టంగా అర్థం అవుతోందని అన్నారు. అవినీతి ఆరోపణలతో దాదాపు పదిహేను నెలలు జైలులో గడిపి దీర్ఘకాలంగా బెయిల్ పై విజయసాయి ఉన్నారని గుర్తు చేస్తూ ఏ రోజైనా బెయిల్ రద్దు అయి తిరిగి ఊచలు లెక్కించాల్సిందేనని అన్నారు.
పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెత విజయసాయికి వర్తిస్తుందని అన్నారు. ఆంధ్ర యూనివర్శిటీకి 600 ఎకరాలు దానం చేయడమే కాక వేలకు వేల ఎకరాల భూములను పలు ఆలయాలకు, ధార్మిక సంస్థలకు దానం చేసిన ఘన చరిత్ర అశోక్ కుటుంబానికి ఉందని వడ్డే గుర్తు చేశారు. అశోక్ గజపతిరాజును విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడానికి ప్రయత్నించడమే అవుతుందని వడ్డే అన్నారు. కలలో కూడా తప్పుడు ఆలోచనలు అశోక్ కు రావని అన్నారు. బాధ్యతాయుతమైన ఎంపి పదవిలో ఉండి ఇటువంటి అసత్య, దౌర్భాగ్య ప్రకటనలు చేయడం ఎంత మాత్రం మంచిది కాదని వడ్డే హితవు పలికారు.
Read More: Nama Nageswararao: ఈడీ సమన్లపై టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామా స్పందన ఇదీ.
హైకోర్టు తీర్పుతో మాన్సాస్, సింహాచలం దేవస్థానాల ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు మరల బాధ్యతలు స్వీకరించగా విజయసాయి ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళతామనీ పేర్కొన్న విజయసాయి రెడ్డి..అశోక్ ఒక దొంగ, ఫోర్జరీ కేసు కూడా ఆయనపై ఉంది. మళ్లీ చైర్మన్ పదవి నుండి దిగడం ఖాయం, ఎప్పటికైనా జైలుకు వెళ్లడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే విజయసాయి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.