శబరిమల, జనవరి 16: శబరిమల పరిసరాల్లో మరో మారు ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శబరిమల అయ్యప్ప దర్శనానికి బుధవారం వేకువజామున ఇద్దరు మహిళలు మరి కొందరి సహాయంతో వెళుతుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. పంబ బేస్ క్యాంప్ దాటి వెళుతుండగా నీలిమల వద్ద వారిని అడ్డుకొని వెనక్కు పంపించారు.
కన్నూరు గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు ఎవరికి అనుమానం రాకుండా పురుషుల దుస్తులు ధరించి తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో శబరిమల దర్శనానికి బయలుదేరారు. దాదాపు ఐదు కిలో మీటర్లు నడిచారు. వీరిని ఆందోళనకారులు గుర్తించి అడ్డుకున్నారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మహిళలు మరి కొంత దూరం ముందుకు వెళ్లారు. నీలిమల వద్ద పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వీరిని అడ్డుకున్నారు. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది,
ఆందోళన నేపథ్యంలో ఆ మహిళలను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.
శబరిమల ఆలయాన్ని అన్ని వయస్సుల మహిళలు దర్శించుకోవచ్చని సుప్రీం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేరళలలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, హిందూ మనోభావాలను, ఆలయ పవిత్రతను కాపాడాలని కొందరు అయ్యప్ప భక్తులు నిరసనలు చేపట్టారు.
సుప్రీం తీర్పు అనంతరం ఈ నెల రెండవ తేదీన ఇద్దరు మహిళలు తొలిసారిగా శబరిమల అయ్యప్పను దర్శించుకొని చరిత్ర సృష్టించారు. దీనిపై ఆలయ అర్చకులు కొద్ది గంటల పాటు ఆలయాన్ని మూసి వేసి సంప్రోక్షణ చేసిన అనంతరం యధావిధిగా భక్తులకు దర్శనం అవకాశం కల్పించిన విషయం విదితమే.