తిరువనంతపురం , జనవరి 4: శబరిమల ఆలయంలోకి వెళ్ళేందుకు మరో మహిళ ప్రయత్నించి విఫలం అయ్యారు. తమిళ మూలాలు ఉన్న శ్రీలంకకు చెందిన శశికళ(46) తన భర్తతో కలసి గురువారం రాత్రి అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించగా భక్తులు అడ్డుకున్నారు. ఆలయంలో 18 మెట్లవరకు వెళ్ళిన ఆమెను అక్కడ అడ్డుకోవడంతో తాను రుతుక్రమం ఆగిపోయే దశలో ఉన్నాననీ, అందుకు సంబంధించి వైద్యులు జారీ చేసిన సర్టిఫికేట్లు కూడా చూపించినప్పటికీ, ఆలయంలోకి పోకుండా అడ్డుకోవడంతో వెనుదిరిగినట్లు శశికళ తెలిపారు.
ఈనెల 2న కేరళకు చెందిన కనకదుర్గ, బిందు అనే ఇరువురు అతివలు అయ్యప్ప ఆలయంలోకి వెళ్ళడం వివాదానికి దారితీసింది. ఈ సంఘటనపైన కేరళలో అయ్యప్ప భక్తుల నిరసనలు కొనసాగుతున్నాయి.
శబరిమల ఆలయంలోకి 10నుంచి 50 ఏళ్ళలోపు ఆడవారిని అనుమతించరు.
తమిళ సంతతికి చెందిన అశోక్ కుమారన్ శశికళగా ఆమెను గుర్తించారు.
అయ్యప్ప మాల ధరించి 40 రోజుల పాటు దీక్ష చేపట్టినట్లు శశికళ తెలిపారు.