వల్లభనేని వంశీ…టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేల్లో ఒకరు. తెలుగుదేశం పార్టీకి ఊహించని షాకిచ్చి అధికార వైసీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేల్లో మొదటి వ్యక్తి.
అప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి షాకుల మీద షాకులు ఇస్తున్న యువ నేత. అయితే, తాజాగా ఆయన చేసిన కామెంట్లు వైసీపీ నేతలకే షాక్ ఇచ్చేలా ఉన్నాయని అంటున్నారు.
జగన్ ఇబ్బంది పడతారు కదా వంశీ?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్న వంశీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్చార్జినని చెప్పడమే కాకుండా ఎమ్మెల్యేను అని కూడా స్వయంగా ప్రకటించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ వైసీపీ కండువా కప్పుకోలేదు. అలాంటప్పుడు టీడీపీ ఎమ్మెల్యేని వైసీపీ పార్టీ ఇంచార్జి అని చెప్పుకోవడం ఏమిటి అనేది సహజంగానే తెరమీదకు వచ్చే డౌట్.
వంశీ ఎందుకిలా మాట్లాడారంటే…
వల్లభనేని వంశీ ఎందుకిలా మాట్లాడారనే దాని వెనుక గన్నవరం రాజకీయాలను గమనించిన వారు కొత్త విశ్లేషణ చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేతలుగా దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వ్యవహరిస్తున్నారు. క్యాడర్ కూడా వీరి వెనుకే ఉంది. తానే నియోజకవర్గ వైసీపీ నేత అని యార్లగడ్డ ఎప్పుడో ప్రకటించేశారు. అలాగే పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక మరో ముఖ్య నేత దుట్టా రామచంద్ర రావు అల్లుడు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. తను వైఎస్ కుటుంబానికి చెందిన వాడిని అని చెబుతూ నియోజకవర్గంలో కావాల్సిన పనులు చేయించుకున్నారు.
ఏం చేయాలో తెలియని వంశీ….
వైసీపీ గన్నవరం నియోజకవర్గ ముఖ్య నేతలుగా గుర్తింపు పొందిన యార్లగడ్డ, దుట్టా రామచంద్రరావులు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. దీంతో సహజంగానే వల్లభనేని వంశీకి వైసీపీ క్యాడర్ సపోర్ట్ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్నప్పటి నుండి తనతో పాటు ఉన్న వారితోనే వంశీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అయితే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన పట్టు పెంచుకునేందుకు సత్తా కొనసాగించేందుకు వంశీ స్వయంగా ఎంట్రీ ఇచ్చి తానే వైసీపీ ఇంచార్జీనని ప్రకటించనుకున్నట్లు కొందరు విశ్లేషిస్తున్నారు.
వంశీ చేసిన పనికి జగన్…
అయితే, వల్లభనేని వంశీ తన నియోజకవర్గ రాజకీయంలో భాగంగా చేసిన ప్రకటన వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ను ఇరకాటంలో పడేసిందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తన పార్టీలో ఎవైరాన ఎమ్మెల్యేలు చేరాలనుకుంటే, వారి పదవులకు రాజీనామా చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పేశారు. దీంతో వంశీ రాజీనామా చేయలేదు కానీ వైసీపీకి మద్దతు ప్రకటిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు తాను వైసీపీ నేత, ఏకంగా పార్టీ ఇంచార్జీగా ఎలా ప్రకటించుకున్నారో జగన్ చెప్పాలని నెటిజన్లు సహజంగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఉద్దేశించి ప్రశ్నల వర్ష కురిపిస్తున్నారు. వల్లభనేని వంశీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఏమైనా మినహాయింపు ఇచ్చారా అలా ఇవ్వకపోతే వంశీయే స్వయంగా తీసుకున్నారా? అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి వారి సమాధానం ఏంటో మరి!