ఏపీ రాజకీయాల్లో… కాదు కాదు ప్రత్యేకింఛి టీడీపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీది ఒక ప్రత్యేకమైన శైలి. ఆ ప్రత్యేకత గురించి కాసేపు పక్కనపెడితే… టీడీపీ ఎమ్మెల్యే అయిన వంశీ ఆ పార్టీతోనూ, ఆ పార్టీ అధినేతతోనూ విభేధించి… అనధికారిక వైకాపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా తనను ప్రత్యేక ప్రతినిధిగా గుర్తించాలని స్పీకర్ ని విజ్ఞప్తి చేసిన సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ అనధికారిక హోదా ఇంకెంతకాలం… ఒక సారి రిజైన్ చేసేసి, ఉప ఎన్నికలలు వెళ్లి గెలిచి… తన సత్తా తన సత్తానే తప్ప.. టీడీపీ సత్తా కాదని నిరూపించాలనుకున్నారని వార్తలొచ్చాయి. కానీ…ఈ విషయంలో వంశీ వెనక్కి తగ్గారని తెలుస్తోంది!
తన గెలుపు తన కష్టార్జితం… ఇందులో టీడీపీ పాత్ర ఉండొచ్చేమో కానీ చంద్రబాబు పాత్ర అస్సలు లేదని గంటాపథంగా చెప్పే వంశీ… తనను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కొత్తగా రాజినామా చేస్తే ఎంత..? చేయకపోతే ఎంత..? అనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అదేంటి తనపై తనకు ఎంతో ధైర్యం, కులమతాలకు అతీతంగా తన వెంట ఉన్న తన ప్రజలపై మరెంతో నమ్మకం అని చెప్పే వంశీ… తనను తాను “వితౌట్ టీడిపీ” నిరూపించుకునే అవకాశం వస్తే.. పైగా జగన్ లాంటి బలమైన శక్తి వెనకాల ఉంటే ఇలా జంకుతున్నారేంటని ప్రశ్నలు రావడం మొదలయ్యింది!
ఆ ప్రశ్నలకు గన్నవరం నుంచి వచ్చిన సమాధానాం ఏంటంటే… గన్నవరంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వంశీకి కష్టమేనట. కారణం… వంశీ మీద ఓడిపోయిన వర్గం ఎలాగూ ఆయన కోసం పనిచేయదు.. ఇక వంశీ సామాజికవర్గం ఎక్కువభాగం టీడీపీ వైపు ఉంటుంది.. కాకపోతే బీసీ వర్గాలు కాస్త అటు ఇటూ ఉండొచ్చంటున్నారు! ఇదే క్రమంలో వంశీపై ఇంటా బయటా కాస్త వ్యతిరేకత ఉండటం వల్ల.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వంశీకి కాస్త ఇబ్బందే అని అంటున్నారు!
ఇన్ని విషయాలపై క్లారిటీ వచ్చిన అనంతరం… ఇక రాజీనామా, మళ్లీ ఎన్నికలు వంటి ఆలోచనలను విరమించుకున్నారని అంటున్నారు గన్నవరం జనం! ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిస్క్ చేసి.. ఫలితం రివర్స్ అయితే … ఇక శాస్వత విరామమే అనేది వారి అభిప్రయంగా ఉంది! మరి ఈ పరిస్థితులు రావడం వల్ల… వంశీ ఏమైనా పశ్చాత్తాప పడుతున్నారా లేక… ఇప్పటికీ తాను చేసింది కరక్టే అనే బలమైన అభిప్రాయంతోనే ఉన్నారా అనేది తెలియాల్సి ఉందనేది గన్నవరం ప్రజల మాట!!