కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నేషనల్ హైవే పై హైడ్రామా చోటు చేసుకుంది. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి- వంగవీటి రాధ వర్గీయుల అనుచరుల మధ్య గొడవ చోటు చేసుకుంది. హైవే ప్రయాణిస్తూ ఉండగా ఎమ్మెల్యే అనుచరుల వాహనాలు కాన్వాయ్ దాటి ముందుకు వెళ్ళి పోయే తరుణంలో రాధా వర్గీయుల వాహనాల మధ్యలో ఎమ్మెల్యే వాహనం ఉండిపోవడంతో..ఎమ్మెల్యే వర్గీయులు రాధా వర్గీయులను తప్పుకోవాలని కేకలు వేయడంతో రెండు గ్రూపుల మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరిగింది.
ఇద్దరి అనుచరుల మధ్య వాగ్వివాదంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ లోపు కృష్ణా జిల్లా పోలీసులు రావడంతో ఇరువర్గాలకు చెందిన అనుచరులకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మరోపక్క కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద ఈ ఘటన తో ట్రాఫిక్ నెలకొంది. దీంతో అనుచరులను శాంతింప చేయటానికి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి- వంగవీటి రాధ ఇద్దరూ ఒకే వాహనంపై విజయవాడ బయలుదేరడం తో మిగతావారంతా షాకయ్యారు.
ప్రస్తుతం టీడీపీ పార్టీలో ఉన్న వంగవీటి రాధా గతంలో వైసీపీ పార్టీలో కీలకంగా రాణించారు. సరిగ్గా ఎన్నికల సమయంలో టికెట్ విషయంలో హైకమాండ్ తో మాట మాట రావటంతో పార్టీని వీడి 2019 ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయకుండా టిడిపి కండువా కప్పుకున్నారు. ఇటువంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తో వంగవీటి రాధ ఒకే కారులో ప్రయాణించడం తో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనం అయింది.