తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగిపోయే షాకిస్తూ, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మెహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.
సీఎం వైఎస్.జగన్ సమక్షంలో ఎమ్మెల్యే గణేష్ కుమారులు వాసుపల్లి సాకేత్, వాసుపల్లి సూర్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాసుపల్లి సూర్య, సాకేత్కు కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆహ్వానించారు. సాంకేతిక అంశాల నేపథ్యంలో కండువా కప్పుకోలేదు.
వాసుపల్లి గణేష్ లెక్క ఏంటంటే…
వైసీపీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడని పేర్కొన్న గణేష్ పేదలకు సంక్షేమ పథకాలు అందించే మనస్సు ఉందని అన్నారు. పేదలకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందించడం టీడీపీ వల్ల సాధ్యం కాదని ఆయన అన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు ఆహ్వానించదగ్గ విషయమన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలో చేరానని అన్నారు. 13 ఏళ్లు టీడీపీకి సేవలందించానని తెలిపారు. విశాఖకు వలస వచ్చిన నేతలే అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారన్న ఆయన విశాఖ వాసిగా రాజధాని వస్తుందనగానే స్వాగతించానని అన్నారు.
గణేష్ బీపీ పెంచేశారుగా?
తనపై టీడీపీ అనర్హత పిటిషన్ వేస్తే ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికలకు వెళ్లడానికి కూడా సిద్దమేనని ఆయన తేల్చిచెప్పారు. విశాఖలో పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని వాసుపల్లి గణేష్ ప్రకటించారు. వచ్చే విశాఖ మేయర్ ఎన్నికల్లో నూరు శాతం సీట్లు గెలిపించుకునేలా కృషి చేసి జగన్ కు కానుకగా ఇస్తానని అన్నారు.
టీడీపీకి బొక్కే
ఓ వైపు ఎమ్మెల్యేను వదులుకున్న టీడీపీ మరోవైపు వాసుపల్లి గణేష్ చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేక పోతోందని చర్చ జరుగుతోంది. తనపై టీడీపీ అనర్హత పిటిషన్ వేస్తే ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని ఎన్నికలకు వెళ్లడానికి కూడా సిద్దమేనని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ప్రకటించడం విశాఖలో టీడీపీ పరిస్థితికి అద్దం పడుతోందని పలువురు చెప్తున్నారు. మరోవైపు వైసీపీని విశాఖలో బలోపేతం చేస్తానని ప్రకటించిన వాసుపల్లి రాబోయే ఎన్నికల్లో విశాఖలో మేయర్ సీటు వైసీపీ కైవసం చేసుకునేలా కృషి చేస్తానని ప్రకటించడం తెలుగుదేశం పార్టీకి షాక్ వంటిదంటుననారు. గతంలో టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న వాసుపల్లి నాయకత్వంపై నమ్మకంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైసీపీలో చేరడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. ఈ మేరకు త్వరలోనే ఆయన కార్యాచరణ ఉంటుందని చెప్తున్నారు.