కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అధికారం కైవసం చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇద్దరు కొత్త అధ్యక్షులను సైతం ప్రకటించింది.
ఏపీకి సోము వీర్రాజు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం వైఖరికి భిన్నమైన ప్రకటన చేశారని అంటున్నారు.
అమరావతి గురించి వీర్రాజు ఏమంటున్నారంటే…
ఏపీలో హాట్ టాపిక్ అంశాల్లో అమరావతి ఒకటి. రాష్ట్రం విడిపోయిన అనంతరం అప్పటి సీఎం చంద్రబాబు భారీ ఎత్తున భూములు సేకరించి నవ్యాంధ్రకు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అక్కడ తాత్కాలిక భవనాలు కూడా నిర్మించి పాలన ప్రారంభించారు. అయితే, ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత అమరావతి బదులుగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ కూడా ఉంది. ఈ డిమాండ్పై కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా తాజాగా ఏపీ బీజేపీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వీర్రాజు గారి మాట విన్నారా?
గుంటూరు జిల్లా తుళ్లూరులో ‘భారతీయ కిసాన్ సంఘ్’ రైతుల సమ్మేళనంలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ సందర్భంగా ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా చెబుతున్నా.. ఏపీ రాజధాని అమరావతియే అని ప్రకటించారు. అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది బీజేపీ లక్ష్యం.. ఇందులో రెండో అంశానికి తావు లేదని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులు నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న సోము వీర్రాజు అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ ఉద్యమం చేస్తుందని సోము వీర్రాజు ప్రకటించారు.
మాట తప్పం … మడమ తిప్పం
ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి వైపే ఉన్నారనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయని సోము వీర్రాజు అన్నారు. ఏపీ బీజేపీ కార్యాలయం విజయవాడలోనే కడుతున్నామని తెలిపారు. రూ. 1800 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆగిందా?. దుర్గమ్మ ఫ్లై ఓవర్ పూర్తీ చేసామా లేదా? అంటూ వీర్రాజు ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి అధికారం ఇస్తే.. అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు . తాను మోడీ ప్రతినిధిగానే మాట్లాడుతున్నానని వైఎస్ జగన్ వలే బీజేపీ మాట తప్పదన్న ఆయన.. మడమ తిప్పం. బీజేపీ మాట తప్పే పార్టీకాదని స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికే రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలో , ఎలా ఉండాలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమేనని , తాము జోక్యం చేసుకోబోమని కేంద్రం పలు దఫాలుగా కోర్టుల్లో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరి మోడీ ప్రతినిధిగా చెప్తున్నానని పేర్కొన్న వీర్రాజు ఈ విషయం ఎందుకు మరిచారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.