వెల్లూరు : తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ స్థానం ఎన్నికపై సందిగ్దత వీడలేదు. ఎన్నిక జరుగుతుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల కమిషన్, ఆదాయపన్ను శాఖ తనిఖీల్లో స్థానిక డిఎంకె అభ్యర్థి కాదిర్ ఆనంద్ కార్యాలయంలో భారీగా నగదు పట్టుబడింది. దాదాపు 11 కోట్ల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని భావించిన రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లూరు లోక్సభ ఎన్నికల రద్దుకు సిఫార్సు చేస్తూ ఢిల్లీలోని అధికారులకు లేఖ రాసినట్లు సోమవారం వార్తలొచ్చాయి. అలాగే అభ్యర్థి ఆనంద్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చిన నేరం కింద కేసు నమోదు చేశారు.
ఈ వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల రద్దుపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. అయితే ఎన్నికల రద్దు చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం భారత రాష్ట్ర పతి రామ్ నాధ్ కోవింద్కు చేర వేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి నిర్ణయం మీదే వెల్లూరు ఎన్నిక ఆధారపడి ఉందని సమాచారం.
వెల్లూరు లోక్ సభ స్థానానికి గురువారం(ఏప్రిల్ 18 ) ఎన్నిక జరగాల్సి ఉన్నది.