అమరావతిలోనే ఏపీ పూర్తి రాజధాని ఉండాలంటూ గత కొంత కాలంగా దీక్షలూ, ధర్నాలూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఇరవైతొమ్మిది గ్రామాల ప్రజలతో పాటు తనకు 13జిల్లాల ప్రజలూ ముఖ్యమనే భావనతో… కేవలం గుంటూరు – విజయవాడ కాదు… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చేందాలనే ఆశయంతో ముందుకువెళ్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి! అభివృద్ధి వికేంద్రీకరణకు.. పరిపాలనా వికేంద్రీకరణ కూడా అవసరం అనేది ఆయన భావన కావొచ్చు. అయితే ప్రస్తుతం ఈ విషయం ప్రథమ పౌరుల వద్దకు చేరబొతోంది!
అవును… ఏపీ అసెంబ్లీ ఆమోదించిన సీఆర్డీఏ రద్దు బిల్లు, మూడు రాజధానుల బిల్లును స్పీకర్ తమ్మినేని సీతారం, గవర్నర్ వద్దకు పంపనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ ఆమోదంతోనే ఈ పని పూర్తయిపోతుందా లేక రాష్ట్రపతి వరకూ వెళ్లాల్సి వస్తోందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం… రాష్ట్ర పరిధిలోని బిల్లులకు అయితే గవర్నర్ ఆమోదం సరిపోతుంది కానీ.. కేంద్ర చట్టాలతో ముడిపడిన చట్టం కావటంతో, ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుందనే వాదనా వినిపిస్తుంది! అదే జరిగితే హస్తినలో వెంకయ్య నాయుడు హస్తం కీలకం కాబోతుందనే మాటలు వినిపిస్తున్నాయి!!
213రోజులుగా ఏపీ లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ప్రభుత్వం చేబుతున్న చోట రైతులు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించేలా వెంకయ్య పావులు కదిపే సూచనలు ఉన్నాయని అంటున్నారు! అదే జరిగితే మాత్రం… ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతి నుంచి కీలక ప్రకటన రావొచ్చనేది రాజకీయ వర్గాల్లో నడుస్తోన్న చర్చ!! కాకపోతే.. అసలు ఈ బిల్లుల వ్యవహారం రాష్ట్రపతి వరకూ వెళ్లబోతోందా లేదా అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే!!