తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దిగజారి పోయే విధంగా మారటంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో అదేవిధంగా గతంలో పార్టీలో మంత్రులు గా వ్యవహరించిన వారితో బేటీ అవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటు బ్యాంకు చాలావరకు కనుమరుగై పోవటంతో టి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సైతం పార్టీని కాపాడుకోవడం కోసం అనేక సలహాలు ఠాగూర్ కి ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓటమికి తానే బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయటం మనకందరికీ తెలిసిందే.
అయితే టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి అప్పగించాలి అనేదానిపై ఠాగూర్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుల దగ్గర తీసుకుంటున్న అభిప్రాయాల మేరకు తాజాగా వీ హనుమంతరావు సలహా కూడా వినటం జరిగింది. ఈ సందర్భంగా టాగూర్ తో భేటీ అయిన తర్వాత మీడియాతో విహెచ్..మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే పీసీసీ చీఫ్ పోస్ట్ను రెడ్డీలకు ఎప్పూడూ ఇస్తూనే ఉన్నారు.. ఈ సారి బీసీలకు ఇవ్వాలని వి.హెచ్ టాగూర్ దగ్గర డిమాండ్ చేశారట. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని ఉదాహరణగా కూడా చూపించారట. బీజేపీ కూడా తెలంగాణ అధ్యక్ష పదవి బీసీకే ఇచ్చిందని.. కాంగ్రెస్ కూడా ఈసారి బీసీకే అవకాశం ఇవ్వాలని విహెచ్ డిమాండ్ చేసినట్లు మీడియాతో తెలిపారు.