(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్యులతో పాటు అనేక మంది సెలబ్రిటీలు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. అనేక మంది చికిత్స అనంతరం కరోనా నుండి కోలుకున్నారు. తాజాగా నేడు ఉప రాష్టపతి ఎం వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
మంగళవారం సాధారణ పరీక్షల్లో భాగంగా ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉషా నాయుడు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే వెంకయ్య నాయుడుకి పాజిటివ్ రిపోర్టు రాగా ఆయన సతీమణి ఉషా నాయుడుకి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోవడం, ఆరోగ్యవంతంగా ఉన్నందున వెంకయ్య నాయుడును వైద్యులు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఆయన సతీమణి ఉషా నాయుడు సెల్ప్ ఐసోలేషన్లో ఉన్నారు. ఈ విషయాలను ఉప రాష్ట్రపతి వర్గాలు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.