హైదరాబాద్: ఐటి గ్రిడ్స్ డేటా చోరీ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మే 23 తర్వాత డేటా దొంగలంతా జైలుకే అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు.
‘ఐటి గ్రిడ్స్ డేటా చోరీ కేసు తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారమేకాక పంజాబ్ పౌరుల సమాచారం కూడా దొంగిలించినట్టు వెల్లడైంది. పాకిస్థాన్ ఐఎస్ఐ గూఢచార సంస్థ కంటే ప్రమాదకరంగా రహస్య సమాచార దోపిడీ జరిగింది. మే 23 తర్వాత డేటా దొంగలంతా కటకటాల వెనక్కే’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం ఐటి గ్రిడ్స్ సంస్థ వద్ద ఉందనే ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంస్థపై సోదాలు జరిపి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేశారు.
అయితే హార్డ్ డిస్కుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా ఐటి గ్రిడ్స్ సంస్థ నుంచి స్వాదీనం చేసుకున్న హార్డ్ డిస్కుల్లో ఉన్నట్టు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఎఫ్ఎస్ఎల్(ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ) నాలుగు రాజుల క్రితం నివేదిక ఇచ్చింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది.
మరోవైపు ఐటి గ్రిడ్స్ ఎండి ఆచూకీ ఇంత వరకూ లభ్యం కాలేదు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.